27, మే 2011, శుక్రవారం

అమ్మ - నాన్నగారు

అమ్మ పోయిన ఏడాది లోపే, అమ్మ ఇచ్చే కాఫీ కోసమో లేక ఆమె చెప్పే కబుర్ల కోసమో మరి, నాన్నగారు ఆమెని వెతుక్కుంటూ వెళ్ళి పోయారు.  అమ్మ గురించి చెప్తే అది ఒక అందమైన కధ అవుతుంది, కానీ నాన్నగారి గురించి చెప్పడం మొదలుపెడితే అది ఒక పాఠ్య పుస్తకమౌతుంది.  అందులో హిస్టరీ, ఎకనమిక్స్, సైన్స్, లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. అమ్మ ద్వారా మేము జీవిత సత్యాలు నేర్చుకుంటే నాన్నగారి దగ్గర జీవితపు విలువల్ని తెలుసుకున్నాము. వెరసి ఎలా జీవించాలో నేర్చుకున్నామనే అనుకుంటున్నాను.  నిర్జీవంగా ఉన్న నాన్నగారిని చూసి దుఃఖం ఆపుకొలేకపొతున్న మా చెల్లి స్వాతిని చుస్తే తన మనసులో ఏ ఏ జ్ఞాపకాలు మెదిలేయో   నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి.  చిన్నప్పుడు డాబాలమీద నాన్నగారికి చెరొకవేపు పడుక్కొని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఆయన చెప్పిన విశేషమైన కబుర్లు గుర్తొచ్చి ఉంటాయి. వర్డ్స్ వర్త్, కీట్స్, షెల్లీల పొయెట్రీకి ఆయన ఇచ్చిన అందమైన వివరణలూ, పదో తరగతిలో, నూటికి నూరూ తెచ్చుకోగలిగేలా ఆయన చెప్పిన లెక్కలూ గుర్తొచ్చి ఉంటాయి.  తను ఉద్యోగం చేసేటప్పుడు, సాయంకాలం ఏ మాత్రం లేటైనా ఆదుర్దాగా, ఆఫీసుకే వచ్చేసిన నాన్నగారు గుర్తొచ్చి ఉంటారు. ఆలోచనల్లోనూ, జీవన విధానం లోను  నిత్య చైతన్యమూర్తి, మా జీవితాలకి చైతన్య స్ఫూర్తి అయిన నాన్నగారిని చైతన్య రహితంగా చూడలేక వచ్చిన దుఃఖమది.  రుద్రభూమిలో సున్నితమైన నాన్నగారి  దేహానికి నిర్దయగా అగ్ని సంస్కారం చేసి పంపించి, విశాఖపట్నం ఇంటికి వచ్చ్చాక మా అమ్మాయి కీర్తి నాకు కండొలెన్సె చెప్తున్నట్టు ఇలా అంది. ' అమ్మ డోంట్ బి సాడ్ దట్ ఎ లైఫ్ హాస్ ఎండెడ్, బట్ బి గ్లాడ్ థట్ అ ఫుల్ల్ లైఫ్ హాస్ బీన్ లివ్డ్.'  ఎక్కడిదో ఈ కొటేషన్.  సరిగ్గా చిన్నాన్నగారు కూడా ఇదే మాట అన్నారు, 'విచారించొద్దు ఆయనది పూర్ణ జీవితం' అని.  అంటే ఆయనగురించి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఒక్కలా అనిపించిందన్నమాట. ఆయన తన పిల్లలందర్నీ ఎంతగానో ప్రేమించారు.  మనమల్ని ఇంకెంతగానో ప్రేమించారు.  ఆయన దేహం సున్నితం.  ఆహారపు అలవాట్లు సున్నితం.  మాట సున్నితం, మనసు సున్నితం.  అలాగే అందరితోనూ సున్నితంగా వ్యవహరించేవారు. కానీ ఎంత కష్టాల్లో ఉన్నా భవిష్యత్తు గురించి భయపడని ధీరత్వం, కష్టాన్ని ఎదుర్కోగల ధృఢత్వం ఉండేవి ఆయనలో.
ఎనభై ఐదేళ్ళ వయసులో 'అవసరమేమో అనుకొని ' చేతి కర్ర కొనిస్తే ' అది ముసలివాళ్ళకి నాకు కాదు ' అనగల 'ఆత్మ విశ్వాసం' 'సెన్స్ ఆఫ్ హ్యూమర్ ' ఉండేవి ఆయనలో.  మా కీర్తిని తాత గారి గురించి చెప్పమంటే ఇలా అంటుంది.  'మన తాత గారు ఫెయిరీ టేల్ తాత గారు ' అంది.  'అంటే' అని అడిగితే, దాని దగ్గర రెండు వివరణలు ఉన్నాయి.  ఒకటేంటంటే,  'మా అందరికీ తాతగారు మేము చదవడానికి ముందే ఫెయిరీ టేల్స్ అన్ని చెప్పేవారు.       
    సిండరెల్లా, స్నోవైట్, స్లీపింగ్ బ్యూటీ, యాజ్ యు లైక్ ఇట్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, అరేబియన్ నైట్స్, గల్లివెర్ ట్రావెల్స్ ఇవన్నీ మాకు తాతగారు చెప్పినవే. అందుకని తాతగారు ఫెయిరీ టేల్ తాతగారు.  మరొక వివరణ ఏంటంటే, తాతగారు ' వెయిరీ టేల్స్ లోని తాతగర్ల లాగా ఉంటారు.  'అంటే?.  అంటే, ఫెయిరీ టేల్స్ లో తాతగార్లు చిన్న పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.  వాళ్ళు చెప్పేవి చాలా పేషంట్ గా వింటారు.  మమ్మల్ని చాలా ఈక్వల్ గా ట్రీట్ చేసేవారు.  ఫెయిరీ టేల్ తాతగార్లు చాలా మిస్టిగ్గా ఉంటారు, మన తాతా గారు కూడా అలాగే అనిపించేవారు.
నేను విజయవాడలో ఉండగా నాన్నగారు ఒక సారి ఆ ఊరు వచ్చారు. ఆయన్ని నేను పనిచేసే వ్యాగన్ వర్క్ షాపు ఆఫీసుకి తీసుకువెళ్ళా.  అక్కడ మా ఇంచార్జి నాన్నగారికి షాపు చూపిస్తానని తీసుకువెళ్ళాడు.  అలా వెళ్ళినవాళ్ళు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారు.  మా ఇంచార్జి వగరుస్తూ ' అబ్బ, మీ నాన్నగారికి ఏం ఓపిక.  ఆ సెక్షన్ చూపించు ఈ సెక్షన్ చూపించు అంటూ నన్ను తెగ తిప్పేసారు.  రోజూ తిరిగే నాకు ఆయాసం వచ్చింది కాని, ఆయన మాత్రం ఇంకా తిరుగుదాం అన్నట్టు ఎలా ఉన్నారో చూడూ ' నిజం, మీ నాన్నగారు ఆయుష్షు తొంభై  పైనే' అంటూ నవ్వాడు.  అప్పటికే నాన్నగారి వయసు అరవై దాటిందంతే.  ఆయినా, ఆయన ఆరోగ్యం లో చిన్న చిన్న తెడాలు రావడంతో, మా ఇంచార్జి మాటకి చాలా సంతోష పడ్డాను.  కానీ,   అప్పుడాయన 'వంద ' అని ఎందుకనలేదా అని ఇప్పుడనుకుంటున్నాను.  ఆయన అమ్మని పిలిచే తీరు భలేగా ఉండేది.  భార్యని పేరు పెట్టి పిలవకుండా 'ఏమేవ్' అనో 'ఒసేవ్' అనో పిలిచే రోజులవి.  కాని నాన్నగారు మాత్రం 'ఏమీ' 'ఒకసారి ఇలా వస్తావా అనేవారు.  కానీ ఎక్కువగా మాలో ఒకర్ని పిలిచి 'అమ్మని పిలు ' అనడానికే ఇష్టపడేవారు.  ఆడ పిల్లల్ని 'ఏమిటే' అనీ 'అదీ 'ఇదీ అని పిలవడానికి ఇష్టపడని నాన్నగారు మనసులో ఎక్కడో అమ్మని 'సీతా' అనో 'లక్ష్మీ' అనో పిలవాలనుకునే వారేమో అనిపిస్తుంటుంది నాకు. He was quite romantic at heart.

అభిజ్ఞాన శాకుంతలం లో శకుంతల ముఖాన్ని పుష్పంగా భ్రమించి ఒక భ్రమరం ఆ ముఖారవిందం చుట్టూ  పరిభ్రమించిందని, కాళిదాసు ఎంత గొప్పగా వర్ణించేడో నాకు తెలీదుగానీ, నాన్నగారు మాత్రం చాలా అందంగా వర్ణించి వివరించి చెప్పేవారు. కే ఎల్ సైగల్ పాటలంటే ప్రాణం ఇచ్చేవారు.  నా చిన్నతనంలో ప్రతీ ఉదయం ఏడు గంటలనుండి ఏడున్నర వరకు వచ్చే 'పురానీ గీత్ మాలా ఖచ్చితంగా వినాల్సిందే.  సైగల్, షమ్షాద్ బేగం, సురయా, నూర్జహాన్, గీతా దత్ ల పాటలు వింటూ వాళ్ళతో తను కూడా గొంతు కలిపేవారు. "'అసలు పాట విననివ్వరు ' అనేవారు, అమ్మా హైమా.  హైమకి హింది పాటలంటే మహా పిచ్చి.  పురానీ గీత్ మాలా తర్వాత వచ్చే బినకా గీత్ మాలా సమయానికి రేడియొ పెద్దగా మోగి పోయేది.    ఆ పాటలు వినీ, వినీ మాక్కూడా అప్పట్లో వచ్చే తెలుగు పాటలు నచ్చేవి కావు
ఇక పురానీ గీత్ మాలా లో ఆఖరుగా వచ్చే సైగల్ పాట కోసం నాన్నగారు కాచుక్కురుచునేవారు.   'సోజా రాజకుమారీ, సోజా'  పాట విని నేను అమ్మాయికి జోల పాడుతున్నాడేమొ అనుకున్నా.  కాని రాకుమారి సమాధి దగ్గర, ఆ అమ్మాయిని ఎంతో ఇష్ట పడ్డ అబ్బాయి పాడిన పాట అది అని ఎంతో హృద్యంగా వివరించి చెప్పేవారు.

ఆయన మా అందరికీ అన్ని విధాలుగా ఎంతో అండగా నిలిచేవారు.  నేను చోడవరంలో డిగ్రీ ప్రైవేటుగా చదువుతున్నప్పుడు, నాకు బాగా తెలిసిన ఒకమ్మాయి తను ఇష్టపడ్డ అబ్బాయితో హఠాత్తుగా జంప్.  నేను ఆశ్చర్యంలోంచి తేరుకోక మునుపే నాకోసం మా ఇంటికి  నాలుగిళ్ళవతల చిన్న క్లినిక్ నడుపుతున్న ఒక డాక్టరుగారు వాళ్ళ ఆయాతో కబురు.  'ఆ అబ్బాయి వాళ్ళు ఈ డాక్టరుగారి తెలుసుట, నా దగ్గర వివరమేమైన  తెలుస్తుందని '.  అప్పటికి హలా చిన్నదాన్నవడం, ఇలాంటి వ్యవహారాలు కొత్త అవడం చేతా , 'ఈ గొడవేంట్రా బాబూ' అని నేను చాలా భయపడ్డాను.  తరవాత వస్తానని చెప్పి ఆ ఆయాని పంపించేసాను.  నాన్నగారు ఇంటికి రాగానే విషయమంతా చెప్పేను.  పద, అంటూ నాన్నగారు నాతో వచ్చారు.  ఆయన్ని చూసి దాక్టరుగారు అవాక్కయ్యారు.  అప్పటికే, 'రిటైర్డ్ బీడీవో గారని, లెక్ఖలూ, పాఠాలూ బాగ చెప్తారని, తనూ, తన కుటుంబం తప్ప వేరే ఏ విషయమూ పెద్దగా పట్టించుకోరనీనాన్నాగారికి ఆ కొలనీలో మంచి పేరు.   ఆయన్ని చూసేక ఆ డాక్టరు గారికి ఏం అడగాలో మట్లాడాలో తోచలేదు.  నాన్నగారే చెప్పేశారు.  ' మా అమ్మాయి చిన్న పిల్లండీ,  బాగా చదువుకొని ఉద్యోగం చెయ్యాలనుకుంటోంది. దాన్ని ఇలాంటి వ్యవహారాల్లోకి లాక్కండి,  పరీక్షలు దగ్గర పడుతున్నయీ అని.  'అబ్బే అలాంటిదేమీ లేదండీ స్నేహితులు కదా విషయమేమైనా తెలుసేమో అనీ అంటూ నీళ్ళు నమిలేడు ఆ డాక్టరుగారు.  'సారీ, మా అమ్మాయికేమీ తెలీదు ' అంటూ నన్ను తీసుకుని వచ్చేసారు.  ఆయనిచ్చిన నైతిక స్థ్యైర్యం నన్ను గాల్లో తేలేలా చెసింది.  నాకే కాదు ఇంట్లో అందరికీ అన్ని అవసరాల్లోనూ తోడుగా నిలిచారు.  ఆర్ధిక అవసరాల దృష్ట్యా, నాకు ఉద్యోగం ఎంతో అవసరమై ఉండి కూడా, నేను విజయవాడలో ఉద్యోగం చేరిన కొత్తలో బెంగెట్టుకుని ఏడిస్తే 'ఉద్యోగం వదిలేసి  వచ్చెయ్యమని ' చెప్పగల మానవత్వం ఉందాయనలో.   
ఆయన జీవితాన్ని యధాతధంగా ఎంత హుందాగా స్వీకరించేరో మరణాన్ని కూడా అంతే హుందాగా స్వీకరించేరు.  ఎంత వయసు మీద పడుతున్నా, ఆఖరికి అమ్మ పోయాక కూడా 'ఏముందింక ' 'ఆ దేముడింక ఎప్పుడు తీసుకు వెళ్తాడో నన్ను '  'ఇంకా ఈ భూమ్మీద  ఉండి చేసేదేముంది ' లాంటి వ్యర్ధపు నిట్టూర్పు మాటలు ఆయన నోటంట వినలేదు.   ఆఖరి రెండు వారాల్లో మాత్రం తన వైటల్ ఆర్గాన్స్ పనిచెయ్యడం లేదని గ్రహించారు.  అప్పుడుకూడా ఆయన గొంతులో నిరాశ ధ్వనించలేదు.  చూడ్డానికి వెళ్ళిన నన్నూ, నా అక్కయ్యలు విజయ, హైమలని పిలిచి షెల్ఫ్ లోంచి 'వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్ ' బుక్ తీయించి తను చెప్పిన పేజీలు ఓపెన్ చేయించి తన ఫిజికల్ పొజిషన్ వివరించారు.     

  ముఖంలో ఎలాంటి భావం లేకుండా అలా వివరిస్తుంటే చాలా బాధనిపించింది.  ఆయన ముఖంలోకి చూస్తే చాలా మామూలుగా చెప్పేస్తున్నారు.  నేను, అక్కయ్యలు హైమ, విజయ పైకి మాములుగా మాట్లాడుతున్నా, బైటికి రాని బాధ ఎదో మా లోలోపల దొలిచేస్తొంది.  నాన్నగారికి ఏదో సేవ చెయ్యాలి.  జ్యూస్ చేసి ఇద్దామా,  పాలు కొంచెం తాగుతారేమో.  ఏదో ఒకటి.  ఏం చేసినా మరి కొద్ది రోజులు,  లేదా నెలలు అని మాకు అర్ధం అవుతున్నా పైకి ఒప్పుకోవడానికి ఇష్ట పడటం లేదు. హైమ తెచ్చిన మెత్తటి సోంపాపిడి తిన్నారు.  విజయ చేసిచ్చిన జ్యుస్ తాగారు.  మేము మాట్లాడుతుండగానే నాన్నగారికి చిన్నగా కునుకు పట్టింది.   మేము ముగ్గురం పక్క గదిలోకి వెళ్ళిపోయేము.  పది నిముషాలకే మళ్ళీ నాన్నగారి పిలుపు, 'ఇక్కడికొచ్చి మాట్లాడుకోండమ్మా' అని. ఇంథకు ముందు అలా ఎప్పుడూ అనగా వినలేదు.  సరే అనుకుని  ఆయన దగ్గరికే వెళ్ళి కూర్చున్నాము.  మేము మాట్లాడుకుంటూ ఉండగానే మళ్ళీ మగతలోకి జారుకున్నారు.  ఆయన మా సాన్నిహిత్యాన్ని ఎంతగా కోరుకుంటన్నారో అర్ధమయ్యింది.  ఆ రోజు సాయంకాలం,  నేను హైమా  మర్నాడు ఉదయం విజయా, అన్నయ్యా వాళ్ళింటినుండి  మనసులో ఎదో వెలితితోనే బయలుదెరి వెళ్ళాము.  తరువాత నాన్నగారి మరణ వార్త తెలిసే వరకూ విలువైనదేదో చెయ్యి జారిపోతున్న ఫీలింగ్.      
ఆఖరి రోజుల్లో కొడుకు చేతి సేవలు అందుకుంటూ, ముందు రోజు 'ఇక పై నన్ను చూసుకోగలవా' అని ఆడిగి, ఆ మర్నాడే, నిద్రలోనే ప్రశాంతంగా కళ్ళు మూసారు.  జీవితాన్ని ఎంతో పాజిటివ్ తీసుకొగలిగిన వాళ్ళకే అంత స్వచ్చంద మరణం సాధ్యం.
మా నాన్నగారు 1920, జూన్ 4వ తేదీన పుట్టారు.  ఆయన మరణించింది 1911, మార్చ్ మూడవ తేదీన.

4 కామెంట్‌లు:

  1. Idi jarigi enta kalamaindo rayaledu, kani mee maatallo aayana leni lotu ento spastamga telustondi.. Baadapadakandi.. Meeru cheppina vari jeevita visheshalu vinte nenuu anukunna me naannagaridi paripoorna jevitam ani.. Alanti jeevitanni kontamande JEEVISTARU.. aayana atma ki shanti chekuralani manaspoortiga korukuntanu..

    రిప్లయితొలగించండి
  2. I share your grief and my heartfelt condolences... Your parents truely qualify for 'Dhanya Jeevulu'...

    Regards

    Seetharam

    రిప్లయితొలగించండి
  3. నాన్నగారి గురించి నీ ఙ్ఞాపకాలు చదివాను. నువ్వు, స్వాతి పుట్టి పెద్దవాళ్ళయే వరకు అన్నయ్య,నేను,హైమ నాన్నగారి ప్రక్కకు చేరి కధలు చెప్పించుకునే
    వాళ్ళం,తొంభై సంవత్సరాల నిండు జీవితం గడిపి సునాయాస మరణంతో వెళ్ళిపోయినా..ఏదో వెలితి..ఇంకొంత కాలం ఉంటేనో,అన్న భావన.కాని ఎవ్వరం ఏమీ చెయ్యలేం కదా.అమ్మా, నాన్నఎంతకాలమైనా ఉండాలనే
    అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. Heartfelt feelings on mother and father. Hence the words became poetry.

    Regards.

    http://readerswork.blogspot.com/

    రిప్లయితొలగించండి