1, జనవరి 2011, శనివారం

అమ్మ బాల్యం - అమ్మతో మా బాల్యం

మా అమ్మది అందమైన అరుదైన గ్రామీణ బాల్యం.  మా అమ్మ ఎక్కువగా బొబ్బిలిలోనూ వాళ్ళమ్మమ్మగారి  ఊరు బొబ్బిలి దగ్గరి పల్లెటూరు భీమవరంలోనూ ఎక్కువగా గడిచింది.  మా అమ్మమ్మ వేదులవారి పిల్ల.  వాళ్ళకి ఆ ఊర్లో పొలాలు, ఇళ్ళు ఉండేవి.  అందువల్ల మా అమ్మకి పొలాలన్నా, తోటలన్న, కళ్ళాలన్నా,  చెరుకు పెనాలన్న ఎంతిష్టమో ఆవిడ తన చిన్నప్పటి సంగతులు చెప్తుంటే అర్ధమౌతుండేది.  ఈ చిన్న విషయం చాలు మా అమ్మ బాల్య ఎంత తియ్యగా గడిచేదొ తెలియడానికి.  మా అమ్మా మిగతా పిల్లలూ కలిసి చిలగద దుంపలు, కొబ్బరి ముక్కలు నులకతాడుకి దండ గుచ్చి ఆ దండని ఆ పళంగా చెత్తో పట్టుకుని బెల్లం పాకం మరుగుతున్న చెరుకు పెనంలో ముంచి పట్టుకునేవారుట.  కాస్సేపటికి అవి ఉడికాయనగానే బయటికి తీసి, చల్లారాక ఎంచక్క తినేవారట. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్.  నాకైతే మా అమ్మ ఎప్పుడు ఈ విషయం చెప్పినా నోరూరిపొయెది.

ఘజల్ శ్రీనివాస్ 'నా బాల్యం నాకిచ్చెయ్యి ' అని దేవుడిని అడిగినట్టు  అమ్మకి తన బాల్యమన్నా చిన్నప్పటి ఆటలన్నా చాలా ఇష్టం.  తన చిన్ననాటి స్నేహితులు ఎవరితో మట్లాడినా, మేము చిన్నప్పుడు ఆడుకొనేవాళ్ళం అని మొదటగా చెప్తుండేది.  అమ్మ చిన్నప్పుడు చిన్న చిన్న సాహసాలు కూడా చేసేది.  మా చిన్నమ్మాయి కీర్తి చెప్పగా ఈ విషయం తెలిసింది.

'అమ్మమ్మ ఒకసారి తన ఫ్రెండ్స్ తో వాళ్ళ ఊరి దగ్గరున్న నదిని దాటుతోంది.  అమ్మమ్మేమో తన ఫ్రెండ్స్ తో 'చూడండి, నేను వెనక్కు నడుస్తా అంటూ ఎదురుగ్గా ఫ్రెండ్స్ ని చూస్తూ వెనక్కి నడవటం మొదలు పెట్టింది.  కాస్సేపటికి నవ్వుతున్న స్నేహితులు కాస్తా చేతులు పైకెత్తి అరవడం మొదలు పెట్టేరు. నీటి శబ్దంలో వాళ్ళేమంటున్నరో వినిపించలేదు. వాళ్ళు ఎంకరేజె చేస్తున్నారనుకుని అమ్మమ్మ ఇంకా స్పీడ్ గా నడిచింది.  ఇంతలో వెనకనుండి అడ్డం లెమ్మని ఎడ్ల బండతని అరుపులు వినిపించాయి. బండి చాలా దగ్గరగా వచ్చేసింది.  ammamma immediately ducked .   బండి పైనించి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ;

ఇక బొబ్బిలి సంగతి సరే సరి.  బొబ్బిలి పేరెత్తితే అమ్మ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.  అమ్మకి తన బాల్యమంటే చాలా ఇష్టం.  బొబ్బిలిలో తను పెరిగిన ఇళ్ళూ, తిరిగిన వీధులూ, ఆడుకున్న అరుగులూ ఎవరికైనా చూపించాలంటే ఎంత సరదానో.  

అమ్మకి బాల్యం విలువ బాగా తెలుసు. అందుకనే మాక్కూడా  చీకూ చింతా లేని బాల్యం అందించింది.  అందరి ఇళ్ళళ్ళోనూ ఉండే చిన్న, చిన్న మాట పట్టింపులే కానీ, అమ్మ నాన్నగారూ పెద్దగా గొడవపడినట్టెప్పుడూ నాకు గుర్తు లేదు.  మా ఇంట్లోని వాతావరణం వల్ల  మాకు దేనికీ బెంగకానీ ఏం లేకపోయినా మాకు లోటు కానీ అనిపించేదికాదు.

నేనూ మాచెల్లి ఆడుకుంటుంటే మాతో కలిసిపోయెది.  మేము పెళ్ళి పందిరి వెయ్యాలని ప్రయత్నిస్తే , పంగల కర్రలతో పందిరి ఎలా వెయ్యాలో నేర్పించేది.  మాకు కొబ్బరాకులతో బూరలు, పెళ్ళికొడుకు, ఫెళ్ళికూతురు బొమ్మలు చేసిచ్చేది. నేనూ, మా చెల్లి వాటికి బట్టలు కట్టేవాళ్ళం.  ఆ బట్టలకోసం టైలర్ షాపుల చుట్టు కట్ చేసి పారేసిన గుడ్డల కోసం తిరిగేవాళ్ళం.

షి ఈజ్ ఎ చైల్డ్ ఎట్ హార్ట్.  మా అమ్మకి బొమ్మల కొలువులంటే ఎంతిష్టమో. మార్గశిరమాసంలో, విశాఖపట్నం కనకమహాలక్ష్మి కోవెల దగ్గర కొన్న మట్టి బొమ్మలు , ఇంకా నక్కపల్లి చెక్క బొమ్మలూ మా ఇంట్లో ఉండేవి.  వాటికి గుడ్డలు చుట్టి రేకు పెట్టెల్లో దాచేది.  బొమ్మల కొలువు పెట్టినప్పుడు మాకు ఏం చెయ్యాలో  మాతో కలిసిపోయి చేసెది. కొలువులో కొలను, గుడి, మెంతి గింజలతో రెండు రోజుల ముందు చేసిన నారుమడి అన్నిటితో చాలా సహజంగా తయారు చేసేది.  మా అమ్మలో  అప్పుడు ఆమె బాల్యం తాలూకు జ్ఞాపకాలు కొట్టొచ్చినట్టు కనపడేవి.


ఇక అమ్మకి దీపావళి బాణా సంచా అంటే ఎంతిష్టమో.  మతాబులు చిచ్చు బుడ్లు చెయ్యడంలో తన నైపుణ్యమంతా జోడించి చేసేది.  మేము చేస్తున్నట్టు కనపడ్డా ఎనభై శాతం అమ్మే పూర్తి చేసేది.  గంధకం, సురేకారం, ఇనుప రజను, ఆముదం ఏది ఎంత పాళ్ళు కలపాలో అమ్మకి కొట్టిన పిండి.  మతాబు గొట్టాలు చేయడం, కూరడం మాకు దగ్గరుండి నేరిపించేది.  ఇక అన్నయ్య సిసింద్రీలు చేస్తుంటే చాలా సాయం చేసేది.  ప్యాకేజీ కర్రని సంపాదించి కాల్చి బొగ్గుని పొడి చేసి వస్త్ర కాడనం చేసి అన్నయ్యకి ఇచ్చేది.  మా అమ్మకి తాట్రేకు టపాకాయలంటే మహా ఇష్టం. తను కాలుస్తూ నాక్కూడా నేర్పించింది.  దీపావళికి ఖర్చని అనుకోకుండా చాలా ఎక్కువగా దీపాలు పెట్టేది.      
పిల్లలు బాణా సంచా కాలుస్తుంటే తను కూడా చిన్న పిల్లలా తెగ సరదా పడేది.  ఇక దీపావళి తరువాత వచ్చే కార్తీక మాసమంటే అమ్మకి చాలా ఇష్టం.  ఆ నెలంతా దీపాల పండగలే కదా, అందుకనేమో.  క్షీరాబ్ది ద్వాదసి చాలా చక్కగా చేసేది.  అరతి డొప్పల్లోనూ కొబ్బరి చిప్పల్లోనూ తులసమ్మ చుట్టూ దీపాలతో నింపేసేది.  ఇక పోలి స్వర్గానికి వెళ్ళే రోజు పొద్దున్నే లేచి దీపాలు నీళ్ళల్లో వదిలేది.   మేము కొట ఉరట్లలో ఉండేటప్పుడు   అక్కడి నదిలోనూ, కశింకొటలో ఉండేటప్పుడు అక్కడి చెరువులోనూ ఆ దీపాల్ని వదిలేది.  మిగిలిన ఊళ్ళల్లో అలాంటి సదుపాయం లేక బకెట్ లో దీపాలు పెట్టి నూతిలో వదిలేది.  అమ్మతో పాటు పొద్దున్నే లేచి అమ్మ వదిలిన దీపాలు ముందుకు వెళుతుంటే చూడడం మాకు చాలా అనందంగా ఉండేది.  కార్తీక మాసం వచ్చినప్పుడల్లా అమ్మ వదిలిన దీపాలు గుర్తుకొచ్చి నేనూ మాచెల్లి మనం కూడా అలా దీపాలు వదిలి పెడదాం అనుకుంటాము.  కానీ వీలుకాదో లేక మరి బధ్ధకమో అలా దీపాలు వదలడమే అవడం లేదు మాకు.  మా అమ్మ పండుగలు మతపరమైన నమ్మకాలతో కాకుండా, సాంప్రదాయ వారసత్వం, అందం, ఆనందం ప్రాతిపదికగా ఉండేవి. పండుగలప్పుడు అయిదింటికే పిల్లలందర్నీ లేపేసి హడావుడి  చేసేది.   ఇక వినాయక చవితి వచ్చిందంటే అటకమీంచి వెదురుతో చేసిన పాలవెల్లిని తీయించేది.  ఆ పాలవెల్లిని దేవుడి దగ్గర కట్టి అలంకరించమని వెంటపడేది.  అమ్మ ప్రోత్సాహంతో మాలో ఉత్సాహం వచ్చేది.  అమ్మ వంట చేస్తుంటే మేము వినాయకుణ్ణీ, పాలవెల్లినీ అలంకరించేవాళ్ళం. పూజకి కావలసిన వస్త్ర్రాలు, యజ్ఞోపవీతాలు, అక్షింతలూ, పంచామృతాలు అన్నీ మా చేతనే చేయించేది. పూజలు పెద్దగా చేయని నాన్నగారు వినాయక చవితి, విజయదశమి రోజులనాడు మాత్రం ఆయనే స్వయంగా మా అందర్నీ కూర్చో పెట్టి పూజ చేయించేవారు. పూజ పూర్తవుతూనే చెంచాతో పంచమృతాలు (ఇష్టమని చాలా పెద్ద గిన్నితో చేసే వాళ్ళం) తీసుకుని నైవేద్యంగా పెట్టిన ఉండ్రాళ్ళు, బుట్టలు, జిల్లుడుగాయలు వెంట పడేవాళ్ళం. అవి అధ్భుతమైన రుచితో ఉండేవి. మన భారతీయ కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే వ్యక్తుల్ని కట్టి పడేస్తాయనుకుంటాను. లేకపోతె ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఈ జ్ఞాపకాలు ఇంత తాజాగా నా మెదడులో భద్రంగా ఉన్నాయంటే అవి ఎంత చిన్నవైనా ఎంత బలీయమైనవో.

మాకు మళ్ళూ మన్యాలూ, పొలాలూ, పంటలూ లేకున్నా, అమ్మ మమ్మల్నీ ఏదీ మిస్ అవనిచ్చేది కాదు. మా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ పెద్ద ఇత్తడి బిందెతో వేరుశనగ కాయాలూ, ఒక మూల గోనె మీద బెల్లం దిమ్మ ఉండేవి. ఇక సీజన్లో చెరుకులు ఎంతగా తినే వాళ్ళమో లెక్ఖలేదు. అప్పట్లో మా నాన్న గారు మానేజరుగ ఉండేవారు. బీడీవో గారికి గేదె ఉండేది. పిల్లలు లేరు. సోమయ్య అనే అతను మాకు చెరుకు గడలు తెచ్చేవాడు. రోడ్డు మీద ఎవరైనా పలకరించినప్పుడు అతనేమనేవాడంటే, 'ఇదిగో, మానేజరుగారికి చెరుకులూ, బీడీవో గారికి గడ్డి పట్టుకెల్తున్నా' అని. అది విని అమ్మ 'నయమే మనకి గేదె లేదు ' అని నవ్వేది. మా అందరి పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు. అప్పట్లో పల్లెటూర్లలో అయిస్ ఫ్రూట్ బళ్ళే కానీ అయిస్ క్రీం షాపులు ఉండేవి కాదు. కాని మా అమ్మ మా కోసం అయిస్ క్రీం చేసేది. ఎలాగో తెలుసా. చిక్కటి పాలని నాలుగో వంతు వరకూ మరిగించి, పంచదార వేసి కవ్వంతో తిప్పి సీసాలో పోసి నాన్నగారికి ఇచ్చేది. దాన్ని ఆయన ఆఫీసుకి పట్టుకెళ్ళి అక్కడి ఫ్రిడ్జ్ లో అయిస్ క్యూబ్ ట్రేలో పెట్టి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుదు ఫ్లాస్క్ లో పెట్టి తెచ్చేవారు. ఇప్పుడు వస్తున్న రకరకాల ఫ్లేవర్లు లేకపోతేనేమి, మంచి క్రీం కలరులో కోవా వాసనతో ఉండి ఆ అయిస్ మా అందరికీ ఎంత నచ్చేదో. ఇప్పుడు తలుచుకుంటె పిల్లలకి అయిస్ క్రీం పెట్టలన్న అమ్మ మనసు కనిపిస్తుంది.




అమ్మ చెయ్యి పట్టుకుని, కోట ఉరట్లలో తనతో వెళ్ళిన పేరంటాలు, మహిళా మండలి మీటింగులూ, పుష్య మాసంలో అమ్మ వేసిన నెలగంట, రధం ముగ్గులూ, (నా కసలు ముగ్గు వెయ్యడమే రాదు), పండగలకి అమ్మ చేసి పెట్టిన తాయిలాలూ, ప్రతీదీ మదిలో సజీవమే. అమ్మ మాకు అధ్భుతమైన బాల్యం అందించింది.



అమ్మతో మా బాల్యమే కాదు, మా పిల్లల బాల్యం కూడా అత్యంత అద్భుతంగా గడిచింది. ఆ వివరాలు మరొకసారి చెప్తా.