27, మే 2011, శుక్రవారం

అమ్మ - నాన్నగారు

అమ్మ పోయిన ఏడాది లోపే, అమ్మ ఇచ్చే కాఫీ కోసమో లేక ఆమె చెప్పే కబుర్ల కోసమో మరి, నాన్నగారు ఆమెని వెతుక్కుంటూ వెళ్ళి పోయారు.  అమ్మ గురించి చెప్తే అది ఒక అందమైన కధ అవుతుంది, కానీ నాన్నగారి గురించి చెప్పడం మొదలుపెడితే అది ఒక పాఠ్య పుస్తకమౌతుంది.  అందులో హిస్టరీ, ఎకనమిక్స్, సైన్స్, లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. అమ్మ ద్వారా మేము జీవిత సత్యాలు నేర్చుకుంటే నాన్నగారి దగ్గర జీవితపు విలువల్ని తెలుసుకున్నాము. వెరసి ఎలా జీవించాలో నేర్చుకున్నామనే అనుకుంటున్నాను.  నిర్జీవంగా ఉన్న నాన్నగారిని చూసి దుఃఖం ఆపుకొలేకపొతున్న మా చెల్లి స్వాతిని చుస్తే తన మనసులో ఏ ఏ జ్ఞాపకాలు మెదిలేయో   నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి.  చిన్నప్పుడు డాబాలమీద నాన్నగారికి చెరొకవేపు పడుక్కొని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఆయన చెప్పిన విశేషమైన కబుర్లు గుర్తొచ్చి ఉంటాయి. వర్డ్స్ వర్త్, కీట్స్, షెల్లీల పొయెట్రీకి ఆయన ఇచ్చిన అందమైన వివరణలూ, పదో తరగతిలో, నూటికి నూరూ తెచ్చుకోగలిగేలా ఆయన చెప్పిన లెక్కలూ గుర్తొచ్చి ఉంటాయి.  తను ఉద్యోగం చేసేటప్పుడు, సాయంకాలం ఏ మాత్రం లేటైనా ఆదుర్దాగా, ఆఫీసుకే వచ్చేసిన నాన్నగారు గుర్తొచ్చి ఉంటారు. ఆలోచనల్లోనూ, జీవన విధానం లోను  నిత్య చైతన్యమూర్తి, మా జీవితాలకి చైతన్య స్ఫూర్తి అయిన నాన్నగారిని చైతన్య రహితంగా చూడలేక వచ్చిన దుఃఖమది.  రుద్రభూమిలో సున్నితమైన నాన్నగారి  దేహానికి నిర్దయగా అగ్ని సంస్కారం చేసి పంపించి, విశాఖపట్నం ఇంటికి వచ్చ్చాక మా అమ్మాయి కీర్తి నాకు కండొలెన్సె చెప్తున్నట్టు ఇలా అంది. ' అమ్మ డోంట్ బి సాడ్ దట్ ఎ లైఫ్ హాస్ ఎండెడ్, బట్ బి గ్లాడ్ థట్ అ ఫుల్ల్ లైఫ్ హాస్ బీన్ లివ్డ్.'  ఎక్కడిదో ఈ కొటేషన్.  సరిగ్గా చిన్నాన్నగారు కూడా ఇదే మాట అన్నారు, 'విచారించొద్దు ఆయనది పూర్ణ జీవితం' అని.  అంటే ఆయనగురించి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఒక్కలా అనిపించిందన్నమాట. ఆయన తన పిల్లలందర్నీ ఎంతగానో ప్రేమించారు.  మనమల్ని ఇంకెంతగానో ప్రేమించారు.  ఆయన దేహం సున్నితం.  ఆహారపు అలవాట్లు సున్నితం.  మాట సున్నితం, మనసు సున్నితం.  అలాగే అందరితోనూ సున్నితంగా వ్యవహరించేవారు. కానీ ఎంత కష్టాల్లో ఉన్నా భవిష్యత్తు గురించి భయపడని ధీరత్వం, కష్టాన్ని ఎదుర్కోగల ధృఢత్వం ఉండేవి ఆయనలో.
ఎనభై ఐదేళ్ళ వయసులో 'అవసరమేమో అనుకొని ' చేతి కర్ర కొనిస్తే ' అది ముసలివాళ్ళకి నాకు కాదు ' అనగల 'ఆత్మ విశ్వాసం' 'సెన్స్ ఆఫ్ హ్యూమర్ ' ఉండేవి ఆయనలో.  మా కీర్తిని తాత గారి గురించి చెప్పమంటే ఇలా అంటుంది.  'మన తాత గారు ఫెయిరీ టేల్ తాత గారు ' అంది.  'అంటే' అని అడిగితే, దాని దగ్గర రెండు వివరణలు ఉన్నాయి.  ఒకటేంటంటే,  'మా అందరికీ తాతగారు మేము చదవడానికి ముందే ఫెయిరీ టేల్స్ అన్ని చెప్పేవారు.       
    సిండరెల్లా, స్నోవైట్, స్లీపింగ్ బ్యూటీ, యాజ్ యు లైక్ ఇట్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, అరేబియన్ నైట్స్, గల్లివెర్ ట్రావెల్స్ ఇవన్నీ మాకు తాతగారు చెప్పినవే. అందుకని తాతగారు ఫెయిరీ టేల్ తాతగారు.  మరొక వివరణ ఏంటంటే, తాతగారు ' వెయిరీ టేల్స్ లోని తాతగర్ల లాగా ఉంటారు.  'అంటే?.  అంటే, ఫెయిరీ టేల్స్ లో తాతగార్లు చిన్న పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.  వాళ్ళు చెప్పేవి చాలా పేషంట్ గా వింటారు.  మమ్మల్ని చాలా ఈక్వల్ గా ట్రీట్ చేసేవారు.  ఫెయిరీ టేల్ తాతగార్లు చాలా మిస్టిగ్గా ఉంటారు, మన తాతా గారు కూడా అలాగే అనిపించేవారు.
నేను విజయవాడలో ఉండగా నాన్నగారు ఒక సారి ఆ ఊరు వచ్చారు. ఆయన్ని నేను పనిచేసే వ్యాగన్ వర్క్ షాపు ఆఫీసుకి తీసుకువెళ్ళా.  అక్కడ మా ఇంచార్జి నాన్నగారికి షాపు చూపిస్తానని తీసుకువెళ్ళాడు.  అలా వెళ్ళినవాళ్ళు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారు.  మా ఇంచార్జి వగరుస్తూ ' అబ్బ, మీ నాన్నగారికి ఏం ఓపిక.  ఆ సెక్షన్ చూపించు ఈ సెక్షన్ చూపించు అంటూ నన్ను తెగ తిప్పేసారు.  రోజూ తిరిగే నాకు ఆయాసం వచ్చింది కాని, ఆయన మాత్రం ఇంకా తిరుగుదాం అన్నట్టు ఎలా ఉన్నారో చూడూ ' నిజం, మీ నాన్నగారు ఆయుష్షు తొంభై  పైనే' అంటూ నవ్వాడు.  అప్పటికే నాన్నగారి వయసు అరవై దాటిందంతే.  ఆయినా, ఆయన ఆరోగ్యం లో చిన్న చిన్న తెడాలు రావడంతో, మా ఇంచార్జి మాటకి చాలా సంతోష పడ్డాను.  కానీ,   అప్పుడాయన 'వంద ' అని ఎందుకనలేదా అని ఇప్పుడనుకుంటున్నాను.  ఆయన అమ్మని పిలిచే తీరు భలేగా ఉండేది.  భార్యని పేరు పెట్టి పిలవకుండా 'ఏమేవ్' అనో 'ఒసేవ్' అనో పిలిచే రోజులవి.  కాని నాన్నగారు మాత్రం 'ఏమీ' 'ఒకసారి ఇలా వస్తావా అనేవారు.  కానీ ఎక్కువగా మాలో ఒకర్ని పిలిచి 'అమ్మని పిలు ' అనడానికే ఇష్టపడేవారు.  ఆడ పిల్లల్ని 'ఏమిటే' అనీ 'అదీ 'ఇదీ అని పిలవడానికి ఇష్టపడని నాన్నగారు మనసులో ఎక్కడో అమ్మని 'సీతా' అనో 'లక్ష్మీ' అనో పిలవాలనుకునే వారేమో అనిపిస్తుంటుంది నాకు. He was quite romantic at heart.

అభిజ్ఞాన శాకుంతలం లో శకుంతల ముఖాన్ని పుష్పంగా భ్రమించి ఒక భ్రమరం ఆ ముఖారవిందం చుట్టూ  పరిభ్రమించిందని, కాళిదాసు ఎంత గొప్పగా వర్ణించేడో నాకు తెలీదుగానీ, నాన్నగారు మాత్రం చాలా అందంగా వర్ణించి వివరించి చెప్పేవారు. కే ఎల్ సైగల్ పాటలంటే ప్రాణం ఇచ్చేవారు.  నా చిన్నతనంలో ప్రతీ ఉదయం ఏడు గంటలనుండి ఏడున్నర వరకు వచ్చే 'పురానీ గీత్ మాలా ఖచ్చితంగా వినాల్సిందే.  సైగల్, షమ్షాద్ బేగం, సురయా, నూర్జహాన్, గీతా దత్ ల పాటలు వింటూ వాళ్ళతో తను కూడా గొంతు కలిపేవారు. "'అసలు పాట విననివ్వరు ' అనేవారు, అమ్మా హైమా.  హైమకి హింది పాటలంటే మహా పిచ్చి.  పురానీ గీత్ మాలా తర్వాత వచ్చే బినకా గీత్ మాలా సమయానికి రేడియొ పెద్దగా మోగి పోయేది.    ఆ పాటలు వినీ, వినీ మాక్కూడా అప్పట్లో వచ్చే తెలుగు పాటలు నచ్చేవి కావు
ఇక పురానీ గీత్ మాలా లో ఆఖరుగా వచ్చే సైగల్ పాట కోసం నాన్నగారు కాచుక్కురుచునేవారు.   'సోజా రాజకుమారీ, సోజా'  పాట విని నేను అమ్మాయికి జోల పాడుతున్నాడేమొ అనుకున్నా.  కాని రాకుమారి సమాధి దగ్గర, ఆ అమ్మాయిని ఎంతో ఇష్ట పడ్డ అబ్బాయి పాడిన పాట అది అని ఎంతో హృద్యంగా వివరించి చెప్పేవారు.

ఆయన మా అందరికీ అన్ని విధాలుగా ఎంతో అండగా నిలిచేవారు.  నేను చోడవరంలో డిగ్రీ ప్రైవేటుగా చదువుతున్నప్పుడు, నాకు బాగా తెలిసిన ఒకమ్మాయి తను ఇష్టపడ్డ అబ్బాయితో హఠాత్తుగా జంప్.  నేను ఆశ్చర్యంలోంచి తేరుకోక మునుపే నాకోసం మా ఇంటికి  నాలుగిళ్ళవతల చిన్న క్లినిక్ నడుపుతున్న ఒక డాక్టరుగారు వాళ్ళ ఆయాతో కబురు.  'ఆ అబ్బాయి వాళ్ళు ఈ డాక్టరుగారి తెలుసుట, నా దగ్గర వివరమేమైన  తెలుస్తుందని '.  అప్పటికి హలా చిన్నదాన్నవడం, ఇలాంటి వ్యవహారాలు కొత్త అవడం చేతా , 'ఈ గొడవేంట్రా బాబూ' అని నేను చాలా భయపడ్డాను.  తరవాత వస్తానని చెప్పి ఆ ఆయాని పంపించేసాను.  నాన్నగారు ఇంటికి రాగానే విషయమంతా చెప్పేను.  పద, అంటూ నాన్నగారు నాతో వచ్చారు.  ఆయన్ని చూసి దాక్టరుగారు అవాక్కయ్యారు.  అప్పటికే, 'రిటైర్డ్ బీడీవో గారని, లెక్ఖలూ, పాఠాలూ బాగ చెప్తారని, తనూ, తన కుటుంబం తప్ప వేరే ఏ విషయమూ పెద్దగా పట్టించుకోరనీనాన్నాగారికి ఆ కొలనీలో మంచి పేరు.   ఆయన్ని చూసేక ఆ డాక్టరు గారికి ఏం అడగాలో మట్లాడాలో తోచలేదు.  నాన్నగారే చెప్పేశారు.  ' మా అమ్మాయి చిన్న పిల్లండీ,  బాగా చదువుకొని ఉద్యోగం చెయ్యాలనుకుంటోంది. దాన్ని ఇలాంటి వ్యవహారాల్లోకి లాక్కండి,  పరీక్షలు దగ్గర పడుతున్నయీ అని.  'అబ్బే అలాంటిదేమీ లేదండీ స్నేహితులు కదా విషయమేమైనా తెలుసేమో అనీ అంటూ నీళ్ళు నమిలేడు ఆ డాక్టరుగారు.  'సారీ, మా అమ్మాయికేమీ తెలీదు ' అంటూ నన్ను తీసుకుని వచ్చేసారు.  ఆయనిచ్చిన నైతిక స్థ్యైర్యం నన్ను గాల్లో తేలేలా చెసింది.  నాకే కాదు ఇంట్లో అందరికీ అన్ని అవసరాల్లోనూ తోడుగా నిలిచారు.  ఆర్ధిక అవసరాల దృష్ట్యా, నాకు ఉద్యోగం ఎంతో అవసరమై ఉండి కూడా, నేను విజయవాడలో ఉద్యోగం చేరిన కొత్తలో బెంగెట్టుకుని ఏడిస్తే 'ఉద్యోగం వదిలేసి  వచ్చెయ్యమని ' చెప్పగల మానవత్వం ఉందాయనలో.   
ఆయన జీవితాన్ని యధాతధంగా ఎంత హుందాగా స్వీకరించేరో మరణాన్ని కూడా అంతే హుందాగా స్వీకరించేరు.  ఎంత వయసు మీద పడుతున్నా, ఆఖరికి అమ్మ పోయాక కూడా 'ఏముందింక ' 'ఆ దేముడింక ఎప్పుడు తీసుకు వెళ్తాడో నన్ను '  'ఇంకా ఈ భూమ్మీద  ఉండి చేసేదేముంది ' లాంటి వ్యర్ధపు నిట్టూర్పు మాటలు ఆయన నోటంట వినలేదు.   ఆఖరి రెండు వారాల్లో మాత్రం తన వైటల్ ఆర్గాన్స్ పనిచెయ్యడం లేదని గ్రహించారు.  అప్పుడుకూడా ఆయన గొంతులో నిరాశ ధ్వనించలేదు.  చూడ్డానికి వెళ్ళిన నన్నూ, నా అక్కయ్యలు విజయ, హైమలని పిలిచి షెల్ఫ్ లోంచి 'వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్ ' బుక్ తీయించి తను చెప్పిన పేజీలు ఓపెన్ చేయించి తన ఫిజికల్ పొజిషన్ వివరించారు.     

  ముఖంలో ఎలాంటి భావం లేకుండా అలా వివరిస్తుంటే చాలా బాధనిపించింది.  ఆయన ముఖంలోకి చూస్తే చాలా మామూలుగా చెప్పేస్తున్నారు.  నేను, అక్కయ్యలు హైమ, విజయ పైకి మాములుగా మాట్లాడుతున్నా, బైటికి రాని బాధ ఎదో మా లోలోపల దొలిచేస్తొంది.  నాన్నగారికి ఏదో సేవ చెయ్యాలి.  జ్యూస్ చేసి ఇద్దామా,  పాలు కొంచెం తాగుతారేమో.  ఏదో ఒకటి.  ఏం చేసినా మరి కొద్ది రోజులు,  లేదా నెలలు అని మాకు అర్ధం అవుతున్నా పైకి ఒప్పుకోవడానికి ఇష్ట పడటం లేదు. హైమ తెచ్చిన మెత్తటి సోంపాపిడి తిన్నారు.  విజయ చేసిచ్చిన జ్యుస్ తాగారు.  మేము మాట్లాడుతుండగానే నాన్నగారికి చిన్నగా కునుకు పట్టింది.   మేము ముగ్గురం పక్క గదిలోకి వెళ్ళిపోయేము.  పది నిముషాలకే మళ్ళీ నాన్నగారి పిలుపు, 'ఇక్కడికొచ్చి మాట్లాడుకోండమ్మా' అని. ఇంథకు ముందు అలా ఎప్పుడూ అనగా వినలేదు.  సరే అనుకుని  ఆయన దగ్గరికే వెళ్ళి కూర్చున్నాము.  మేము మాట్లాడుకుంటూ ఉండగానే మళ్ళీ మగతలోకి జారుకున్నారు.  ఆయన మా సాన్నిహిత్యాన్ని ఎంతగా కోరుకుంటన్నారో అర్ధమయ్యింది.  ఆ రోజు సాయంకాలం,  నేను హైమా  మర్నాడు ఉదయం విజయా, అన్నయ్యా వాళ్ళింటినుండి  మనసులో ఎదో వెలితితోనే బయలుదెరి వెళ్ళాము.  తరువాత నాన్నగారి మరణ వార్త తెలిసే వరకూ విలువైనదేదో చెయ్యి జారిపోతున్న ఫీలింగ్.      
ఆఖరి రోజుల్లో కొడుకు చేతి సేవలు అందుకుంటూ, ముందు రోజు 'ఇక పై నన్ను చూసుకోగలవా' అని ఆడిగి, ఆ మర్నాడే, నిద్రలోనే ప్రశాంతంగా కళ్ళు మూసారు.  జీవితాన్ని ఎంతో పాజిటివ్ తీసుకొగలిగిన వాళ్ళకే అంత స్వచ్చంద మరణం సాధ్యం.
మా నాన్నగారు 1920, జూన్ 4వ తేదీన పుట్టారు.  ఆయన మరణించింది 1911, మార్చ్ మూడవ తేదీన.

1, జనవరి 2011, శనివారం

అమ్మ బాల్యం - అమ్మతో మా బాల్యం

మా అమ్మది అందమైన అరుదైన గ్రామీణ బాల్యం.  మా అమ్మ ఎక్కువగా బొబ్బిలిలోనూ వాళ్ళమ్మమ్మగారి  ఊరు బొబ్బిలి దగ్గరి పల్లెటూరు భీమవరంలోనూ ఎక్కువగా గడిచింది.  మా అమ్మమ్మ వేదులవారి పిల్ల.  వాళ్ళకి ఆ ఊర్లో పొలాలు, ఇళ్ళు ఉండేవి.  అందువల్ల మా అమ్మకి పొలాలన్నా, తోటలన్న, కళ్ళాలన్నా,  చెరుకు పెనాలన్న ఎంతిష్టమో ఆవిడ తన చిన్నప్పటి సంగతులు చెప్తుంటే అర్ధమౌతుండేది.  ఈ చిన్న విషయం చాలు మా అమ్మ బాల్య ఎంత తియ్యగా గడిచేదొ తెలియడానికి.  మా అమ్మా మిగతా పిల్లలూ కలిసి చిలగద దుంపలు, కొబ్బరి ముక్కలు నులకతాడుకి దండ గుచ్చి ఆ దండని ఆ పళంగా చెత్తో పట్టుకుని బెల్లం పాకం మరుగుతున్న చెరుకు పెనంలో ముంచి పట్టుకునేవారుట.  కాస్సేపటికి అవి ఉడికాయనగానే బయటికి తీసి, చల్లారాక ఎంచక్క తినేవారట. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్.  నాకైతే మా అమ్మ ఎప్పుడు ఈ విషయం చెప్పినా నోరూరిపొయెది.

ఘజల్ శ్రీనివాస్ 'నా బాల్యం నాకిచ్చెయ్యి ' అని దేవుడిని అడిగినట్టు  అమ్మకి తన బాల్యమన్నా చిన్నప్పటి ఆటలన్నా చాలా ఇష్టం.  తన చిన్ననాటి స్నేహితులు ఎవరితో మట్లాడినా, మేము చిన్నప్పుడు ఆడుకొనేవాళ్ళం అని మొదటగా చెప్తుండేది.  అమ్మ చిన్నప్పుడు చిన్న చిన్న సాహసాలు కూడా చేసేది.  మా చిన్నమ్మాయి కీర్తి చెప్పగా ఈ విషయం తెలిసింది.

'అమ్మమ్మ ఒకసారి తన ఫ్రెండ్స్ తో వాళ్ళ ఊరి దగ్గరున్న నదిని దాటుతోంది.  అమ్మమ్మేమో తన ఫ్రెండ్స్ తో 'చూడండి, నేను వెనక్కు నడుస్తా అంటూ ఎదురుగ్గా ఫ్రెండ్స్ ని చూస్తూ వెనక్కి నడవటం మొదలు పెట్టింది.  కాస్సేపటికి నవ్వుతున్న స్నేహితులు కాస్తా చేతులు పైకెత్తి అరవడం మొదలు పెట్టేరు. నీటి శబ్దంలో వాళ్ళేమంటున్నరో వినిపించలేదు. వాళ్ళు ఎంకరేజె చేస్తున్నారనుకుని అమ్మమ్మ ఇంకా స్పీడ్ గా నడిచింది.  ఇంతలో వెనకనుండి అడ్డం లెమ్మని ఎడ్ల బండతని అరుపులు వినిపించాయి. బండి చాలా దగ్గరగా వచ్చేసింది.  ammamma immediately ducked .   బండి పైనించి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ;

ఇక బొబ్బిలి సంగతి సరే సరి.  బొబ్బిలి పేరెత్తితే అమ్మ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.  అమ్మకి తన బాల్యమంటే చాలా ఇష్టం.  బొబ్బిలిలో తను పెరిగిన ఇళ్ళూ, తిరిగిన వీధులూ, ఆడుకున్న అరుగులూ ఎవరికైనా చూపించాలంటే ఎంత సరదానో.  

అమ్మకి బాల్యం విలువ బాగా తెలుసు. అందుకనే మాక్కూడా  చీకూ చింతా లేని బాల్యం అందించింది.  అందరి ఇళ్ళళ్ళోనూ ఉండే చిన్న, చిన్న మాట పట్టింపులే కానీ, అమ్మ నాన్నగారూ పెద్దగా గొడవపడినట్టెప్పుడూ నాకు గుర్తు లేదు.  మా ఇంట్లోని వాతావరణం వల్ల  మాకు దేనికీ బెంగకానీ ఏం లేకపోయినా మాకు లోటు కానీ అనిపించేదికాదు.

నేనూ మాచెల్లి ఆడుకుంటుంటే మాతో కలిసిపోయెది.  మేము పెళ్ళి పందిరి వెయ్యాలని ప్రయత్నిస్తే , పంగల కర్రలతో పందిరి ఎలా వెయ్యాలో నేర్పించేది.  మాకు కొబ్బరాకులతో బూరలు, పెళ్ళికొడుకు, ఫెళ్ళికూతురు బొమ్మలు చేసిచ్చేది. నేనూ, మా చెల్లి వాటికి బట్టలు కట్టేవాళ్ళం.  ఆ బట్టలకోసం టైలర్ షాపుల చుట్టు కట్ చేసి పారేసిన గుడ్డల కోసం తిరిగేవాళ్ళం.

షి ఈజ్ ఎ చైల్డ్ ఎట్ హార్ట్.  మా అమ్మకి బొమ్మల కొలువులంటే ఎంతిష్టమో. మార్గశిరమాసంలో, విశాఖపట్నం కనకమహాలక్ష్మి కోవెల దగ్గర కొన్న మట్టి బొమ్మలు , ఇంకా నక్కపల్లి చెక్క బొమ్మలూ మా ఇంట్లో ఉండేవి.  వాటికి గుడ్డలు చుట్టి రేకు పెట్టెల్లో దాచేది.  బొమ్మల కొలువు పెట్టినప్పుడు మాకు ఏం చెయ్యాలో  మాతో కలిసిపోయి చేసెది. కొలువులో కొలను, గుడి, మెంతి గింజలతో రెండు రోజుల ముందు చేసిన నారుమడి అన్నిటితో చాలా సహజంగా తయారు చేసేది.  మా అమ్మలో  అప్పుడు ఆమె బాల్యం తాలూకు జ్ఞాపకాలు కొట్టొచ్చినట్టు కనపడేవి.


ఇక అమ్మకి దీపావళి బాణా సంచా అంటే ఎంతిష్టమో.  మతాబులు చిచ్చు బుడ్లు చెయ్యడంలో తన నైపుణ్యమంతా జోడించి చేసేది.  మేము చేస్తున్నట్టు కనపడ్డా ఎనభై శాతం అమ్మే పూర్తి చేసేది.  గంధకం, సురేకారం, ఇనుప రజను, ఆముదం ఏది ఎంత పాళ్ళు కలపాలో అమ్మకి కొట్టిన పిండి.  మతాబు గొట్టాలు చేయడం, కూరడం మాకు దగ్గరుండి నేరిపించేది.  ఇక అన్నయ్య సిసింద్రీలు చేస్తుంటే చాలా సాయం చేసేది.  ప్యాకేజీ కర్రని సంపాదించి కాల్చి బొగ్గుని పొడి చేసి వస్త్ర కాడనం చేసి అన్నయ్యకి ఇచ్చేది.  మా అమ్మకి తాట్రేకు టపాకాయలంటే మహా ఇష్టం. తను కాలుస్తూ నాక్కూడా నేర్పించింది.  దీపావళికి ఖర్చని అనుకోకుండా చాలా ఎక్కువగా దీపాలు పెట్టేది.      
పిల్లలు బాణా సంచా కాలుస్తుంటే తను కూడా చిన్న పిల్లలా తెగ సరదా పడేది.  ఇక దీపావళి తరువాత వచ్చే కార్తీక మాసమంటే అమ్మకి చాలా ఇష్టం.  ఆ నెలంతా దీపాల పండగలే కదా, అందుకనేమో.  క్షీరాబ్ది ద్వాదసి చాలా చక్కగా చేసేది.  అరతి డొప్పల్లోనూ కొబ్బరి చిప్పల్లోనూ తులసమ్మ చుట్టూ దీపాలతో నింపేసేది.  ఇక పోలి స్వర్గానికి వెళ్ళే రోజు పొద్దున్నే లేచి దీపాలు నీళ్ళల్లో వదిలేది.   మేము కొట ఉరట్లలో ఉండేటప్పుడు   అక్కడి నదిలోనూ, కశింకొటలో ఉండేటప్పుడు అక్కడి చెరువులోనూ ఆ దీపాల్ని వదిలేది.  మిగిలిన ఊళ్ళల్లో అలాంటి సదుపాయం లేక బకెట్ లో దీపాలు పెట్టి నూతిలో వదిలేది.  అమ్మతో పాటు పొద్దున్నే లేచి అమ్మ వదిలిన దీపాలు ముందుకు వెళుతుంటే చూడడం మాకు చాలా అనందంగా ఉండేది.  కార్తీక మాసం వచ్చినప్పుడల్లా అమ్మ వదిలిన దీపాలు గుర్తుకొచ్చి నేనూ మాచెల్లి మనం కూడా అలా దీపాలు వదిలి పెడదాం అనుకుంటాము.  కానీ వీలుకాదో లేక మరి బధ్ధకమో అలా దీపాలు వదలడమే అవడం లేదు మాకు.  మా అమ్మ పండుగలు మతపరమైన నమ్మకాలతో కాకుండా, సాంప్రదాయ వారసత్వం, అందం, ఆనందం ప్రాతిపదికగా ఉండేవి. పండుగలప్పుడు అయిదింటికే పిల్లలందర్నీ లేపేసి హడావుడి  చేసేది.   ఇక వినాయక చవితి వచ్చిందంటే అటకమీంచి వెదురుతో చేసిన పాలవెల్లిని తీయించేది.  ఆ పాలవెల్లిని దేవుడి దగ్గర కట్టి అలంకరించమని వెంటపడేది.  అమ్మ ప్రోత్సాహంతో మాలో ఉత్సాహం వచ్చేది.  అమ్మ వంట చేస్తుంటే మేము వినాయకుణ్ణీ, పాలవెల్లినీ అలంకరించేవాళ్ళం. పూజకి కావలసిన వస్త్ర్రాలు, యజ్ఞోపవీతాలు, అక్షింతలూ, పంచామృతాలు అన్నీ మా చేతనే చేయించేది. పూజలు పెద్దగా చేయని నాన్నగారు వినాయక చవితి, విజయదశమి రోజులనాడు మాత్రం ఆయనే స్వయంగా మా అందర్నీ కూర్చో పెట్టి పూజ చేయించేవారు. పూజ పూర్తవుతూనే చెంచాతో పంచమృతాలు (ఇష్టమని చాలా పెద్ద గిన్నితో చేసే వాళ్ళం) తీసుకుని నైవేద్యంగా పెట్టిన ఉండ్రాళ్ళు, బుట్టలు, జిల్లుడుగాయలు వెంట పడేవాళ్ళం. అవి అధ్భుతమైన రుచితో ఉండేవి. మన భారతీయ కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే వ్యక్తుల్ని కట్టి పడేస్తాయనుకుంటాను. లేకపోతె ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఈ జ్ఞాపకాలు ఇంత తాజాగా నా మెదడులో భద్రంగా ఉన్నాయంటే అవి ఎంత చిన్నవైనా ఎంత బలీయమైనవో.

మాకు మళ్ళూ మన్యాలూ, పొలాలూ, పంటలూ లేకున్నా, అమ్మ మమ్మల్నీ ఏదీ మిస్ అవనిచ్చేది కాదు. మా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ పెద్ద ఇత్తడి బిందెతో వేరుశనగ కాయాలూ, ఒక మూల గోనె మీద బెల్లం దిమ్మ ఉండేవి. ఇక సీజన్లో చెరుకులు ఎంతగా తినే వాళ్ళమో లెక్ఖలేదు. అప్పట్లో మా నాన్న గారు మానేజరుగ ఉండేవారు. బీడీవో గారికి గేదె ఉండేది. పిల్లలు లేరు. సోమయ్య అనే అతను మాకు చెరుకు గడలు తెచ్చేవాడు. రోడ్డు మీద ఎవరైనా పలకరించినప్పుడు అతనేమనేవాడంటే, 'ఇదిగో, మానేజరుగారికి చెరుకులూ, బీడీవో గారికి గడ్డి పట్టుకెల్తున్నా' అని. అది విని అమ్మ 'నయమే మనకి గేదె లేదు ' అని నవ్వేది. మా అందరి పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు. అప్పట్లో పల్లెటూర్లలో అయిస్ ఫ్రూట్ బళ్ళే కానీ అయిస్ క్రీం షాపులు ఉండేవి కాదు. కాని మా అమ్మ మా కోసం అయిస్ క్రీం చేసేది. ఎలాగో తెలుసా. చిక్కటి పాలని నాలుగో వంతు వరకూ మరిగించి, పంచదార వేసి కవ్వంతో తిప్పి సీసాలో పోసి నాన్నగారికి ఇచ్చేది. దాన్ని ఆయన ఆఫీసుకి పట్టుకెళ్ళి అక్కడి ఫ్రిడ్జ్ లో అయిస్ క్యూబ్ ట్రేలో పెట్టి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుదు ఫ్లాస్క్ లో పెట్టి తెచ్చేవారు. ఇప్పుడు వస్తున్న రకరకాల ఫ్లేవర్లు లేకపోతేనేమి, మంచి క్రీం కలరులో కోవా వాసనతో ఉండి ఆ అయిస్ మా అందరికీ ఎంత నచ్చేదో. ఇప్పుడు తలుచుకుంటె పిల్లలకి అయిస్ క్రీం పెట్టలన్న అమ్మ మనసు కనిపిస్తుంది.




అమ్మ చెయ్యి పట్టుకుని, కోట ఉరట్లలో తనతో వెళ్ళిన పేరంటాలు, మహిళా మండలి మీటింగులూ, పుష్య మాసంలో అమ్మ వేసిన నెలగంట, రధం ముగ్గులూ, (నా కసలు ముగ్గు వెయ్యడమే రాదు), పండగలకి అమ్మ చేసి పెట్టిన తాయిలాలూ, ప్రతీదీ మదిలో సజీవమే. అమ్మ మాకు అధ్భుతమైన బాల్యం అందించింది.



అమ్మతో మా బాల్యమే కాదు, మా పిల్లల బాల్యం కూడా అత్యంత అద్భుతంగా గడిచింది. ఆ వివరాలు మరొకసారి చెప్తా.